దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖరరెడ్డి మొదటిసారి పులివెందుల శాసనసభకు 1978లో పోటీ చేసినప్పుడు ఆయనపై సింహాంద్రిపురం మండలం... కోరగుంటపల్లి గ్రామానికి చెందిన దేవిరెడ్డి నారాయణరెడ్డిగారు ప్రత్యర్థిగా పోటీచేశారు. ఈ విషయం చాలామందికి తెలిసిఉండదని అనుకుంటున్నాను. ఆ తరువాత వైఎస్ఆర్ తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరపరచుకుని... 1978లో జనతాపార్టీ ప్రభంజనాన్ని తట్టుకొని విజయం సాధించిన మొదటిసారే రాష్ట్ర మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి పదవిని దక్కించుకున్నారు. రెండేళ్ళు తిరక్కుండానే ముఖ్యమంత్రులు మారినా ఎక్సైజ్, విద్యాశాఖలు లభించాయి. అప్పటికే అయన స్ట్రాంగ్ లీడర్ గా తనకంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నారు. రాజశేఖరరెడ్డి గారు మొత్తం 6సార్లు పులివెందుల నుంచి ఎన్నికకాగా, 4సార్లు కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
ఆ తరువాత చాలా కాలంపాటు ఎటువంటి ప్రభుత్వ పదవీ దక్కలేదు. 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవికోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు. 1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండువేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, ఉచిత విద్యుత్ ప్రచారం ఆయన విజయానికి బాటలు పరచింది. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వైఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. రెండవసారి కూడా చిరంజీవి ప్రభంజనాన్ని తట్టుకుని అధికారంలోకి వచ్చారు. నాడు ప్రజలు ఇంతచేసినా నాకు పాసు మార్కులు మాత్రమే వేశారు అని.. ఇంకా కష్టించి పనిచేయాలని చెప్పి నిత్యం ప్రజల మధ్యన ఉండటానికి ప్రయతించారు. దానిలో భాగంగానే ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడు.
No comments:
Post a Comment